మే 19న పది పరీక్షలపై హైకోర్టు విచారణ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు న్యాయపరమైన అడ్డంకులు తొలగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతిపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

దీనిపై మే 19న విచారణ జరుపుతామని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్ల ధర్మాసనం తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందని పేర్కొంటూ హైదరాబాద్కు చెందిన ఎం.బాలకృష్ణ దాఖలు చేసిన కేసులో హైకోర్టు పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని గత మార్చిలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను రద్దు చేస్తే పరీక్షల నిర్వహణకు అడ్డంకులు తొలగుతాయని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ ప్రస్తావించారు. వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి వైరస్ వ్యాప్తి కాకుండా తగిన జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఉన్నత చదువులకు ఆటంకం కలగకుండా 5.34 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని విద్యా సంవత్సరం నష్టపోకుండా చేయాలన్నారు. హైకోర్టు మార్చి 20న ఇచ్చిన ఉత్తర్వులతో మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 6 వరకూ జరగాల్సిన 8 పేపర్లకు సంబంధించిన పరీక్షలు వాయిదా పడ్డాయని, మిగిలిన పరీక్షలను నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
Published date : 16 May 2020 04:06PM