UPSC Civils Prelims Exam 2024: రేపు యూపీఎస్సీ ప్రిలిమ్స్.. రెండు సెషన్స్లో ఈ పరీక్ష.. ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి..
అనంతపురం: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 16న జరగనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు–2024 పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. ఏడు కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 2,795 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఒక కేంద్రాన్ని దివ్యాంగుల కోసం ఏర్పాటు చేశామని చెప్పారు. కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు, పటిష్ట పోలీసు బందోబస్తు కల్పించాలన్నారు. పరీక్ష నిర్వహణపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో యూపీఎస్సీ (న్యూఢిల్లీ) సెక్షన్ ఆఫీసర్ హిమాన్షు కుమార్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రిలిమనరీ పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా జరుగుతుందన్నారు. పేపర్–1 ఉదయం 9.30 నుంచి ఉదయం 11.30 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.40 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలుగా ఉన్న కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆయా కేంద్రాలకు సూపర్వైజర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. పరీక్ష నిర్వహణకు ఏడుగురు లైజన్ అధికారులను, ఏడుగురు రూట్ అధికారులను నియమించామని వెల్లడించారు. ఇద్దరు అధికారులను రిజర్వులో ఉంచామని చెప్పారు. పరీక్ష కేంద్రం వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ను ఆదేశించారు. కేంద్రాల వద్ద వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని డీఎంఅండ్హెచ్ఓకు సూచించారు.
PK Mishra: ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా
ప్రతి కేంద్రం వద్ద ఒక ఎస్ఐ, ఇద్దరు పురుష పోలీసులు, ఇద్దరు మహిళా పోలీసులను బందోబస్తుగా నియమించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేకంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణకు అప్పగించిన బాధ్యతలును జాగ్రత్తగా నిర్వర్తించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో నగర పాలక కమిషనర్ మేఘ స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అరగంట ముందే చేరుకోవాలి
ప్రిలిమనరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిర్దేశించిన పరీక్ష సమయాని కంటే అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ–ఆడ్మిట్ కార్డు ఉంటేనే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. అలాగే ఏదైనా గుర్తింపు కార్డు తప్పక చూపించాలన్నారు. పెన్, పెన్సిల్, ఈ–అడ్మిట్ కార్డు, సెల్ఫ్ ఫొటోలు తప్ప ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులనూ అనుమతించబోరని స్పష్టం చేశారు.
Mission Life Program: పాఠశాలల్లో మిషన్ లైఫ్ కార్యక్రమం.. విద్యార్థులచే ప్రతిజ్ఞ ఇలా..!
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్
అభ్యర్థుల కోసం కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ (ఫోన్ నంబర్ 8500292992) ఏర్పాటు చేశామన్నారు. 15, 16 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఏదేని సమాచారం, ఫిర్యాదు కోసం అభ్యర్థులు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని సూచించారు.