Skip to main content

Training on teaching skills: బోధన నైపుణ్యాలపై శిక్షణ

Training on teaching skills
Training on teaching skills

కెరమెరి(ఆసిఫాబాద్‌): ఉపాధ్యాయుల్లో బోధన నైపుణ్యాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల్లో శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఉపాధ్యాయులకు శిక్షణ అందించేందుకు రిసోర్స్‌పర్సన్ల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే సెలవుల్లో శిక్షణ తరగతులు నిర్వహించడంపై కొంతమంది టీచర్ల నుంచి వ్యతిరేకత వస్తోంది.

వెనుకబడుతున్న విద్యార్థులు

జిల్లాలో 730 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 2,225 మంది ఉపాధ్యాయలు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో చాలామంది చదవడం, రాయడం కూడా రావడం లేదని, చతుర్విద ప్రక్రియలు చేయడం లేదని విద్యాశాఖ అధి కారులు గుర్తించారు. కనీస సామార్థ్యాలు సాధించడంలో వెనుబడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉపాధ్యాయుల్లో బోధన నైపుణ్యాలు పెంచడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సర్వేల ఆధారంగా ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎన్నడూ లేని విధంగా టీచర్లకు శిక్షణ అందించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ సంబంధిత సబ్జెక్టుల్లో నైపుణ్యత పెంచుకునే విధంగా అవగాహన కల్పించనున్నారు. ఐసీటీ టూల్స్‌, ఏఐ విద్య, అకాడమిక్‌ పరంగా వచ్చే విద్యా సంవత్సరం వచ్చే మార్పులు, తదితర విషయాల గురించి వివరించునున్నారు. ఈ నెల 30 వరకు మండల, జిల్లా పరిధిలోని రిసోర్స్‌పర్సన్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ జాబితాను ఎస్‌సీఈర్‌టీకి పంపించనున్నారు.

నిరాసక్తత..

ఇటీవల మండలాల నుంచి రిసోర్స్‌ పర్సన్లను నామినేట్‌ చేయాలని ఉన్నతాధికారులు మండల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు చేయాలని ఉపాధ్యాయులకు తెలిపారు. అయితే అందుకు నిరాసక్తత చూపుతున్నారు. వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి గడుపుదామనే సమయంలో శిక్షణ నిర్వహించడం సరికాదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దీంతో కొన్నిచోట్ల రిసోర్స్‌పర్సన్లు దరఖాస్తు చేయలేదని సమాచారం. చేసేదేమీ లేక ఎంఈవోలే కొందరిని నామినేట్‌ చేస్తున్నారు.

లోటు పూడ్చేలా..

కరోనా మహమ్మారి మిగిల్చిన అభ్యసన లోటును పూడ్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ అనేక ప్రయత్నాలు చేస్తోంది. వివిధ బోధన పద్ధతులు ఉపయోగిస్తున్నప్పటికీ ప్రాథమిక స్థాయిలో చదవడం, సొంతంగా రాయడం, చతుర్విద ప్రక్రియలు చేయడంలో కొంతమంది విద్యార్థులు వెనకబడి ఉన్నారు. ఉన్నతస్థాయిలో విద్యార్థులు కూడా విషయాలను అర్థం చేసుకుని సొంతంగా రాయలేకపోవతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.

ప్రతీ టీచర్‌ శిక్షణకు హాజరు కావాలి

మండల స్థాయిలో టీచర్లకు వేసవిలో నిర్వహించే శిక్షణకు ప్రతీ టీచర్‌ హాజరు కావాలి. రానున్న విద్యా సంవత్సరం నుంచి వచ్చే మార్పులు, నూతన బోధన పద్ధతుల గురించి వివరిస్తారు. బోధన సామర్థ్యాలు పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. శిక్షణకు సద్వినియోగం చేసుకోవాలి. – ఉప్పులేటి శ్రీనివాస్‌, క్వాలిటీ కోఆర్డినేటర్‌

ఎంపిక ఇలా..

రిసోర్స్‌పర్సన్ల్‌ ఎంపిక బాధ్యత కలెక్టర్‌ ఆధ్వర్యంలో డీఈవోలు డైట్‌ అధ్యాపకులు, బీఎడ్‌ అధ్యాపకులు, ఇతర అధికారులకు అప్పగించారు. ఇంటర్వూ, డెమోలు నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ప్రతీ మండలం నుంచి ఒక్కో సబ్జెక్టుల్లో ఇద్దరు చొప్పున జిల్లా పరిధిలో స్కూల్‌ అసిస్టెంట్లను రిపోర్స్‌పర్సన్లుగా ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వేసవి మే నెలలో జిల్లాలోని ఉపాధ్యాయులకు వీరు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. డీఆర్‌పీలకు రాష్ట్రస్థాయిలో శిక్షణ నిర్వహించనున్నారు. వీరు ఎంఆర్‌పీలకు జిల్లాస్థాయిలో, ఎంఆర్‌పీలు మండలస్థాయిలో ఐదురోజులు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తారు.

Published date : 26 Apr 2025 05:29PM

Photo Stories