Skip to main content

జనాభా-ఆర్థికాభివృద్ధి

-డా॥తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్)
పరిచయం :
జనాభా పరివర్తన (transition) ప్రక్రియలో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ఆధునిక దశ (advanced stage) కు చేరుకున్నాయి. ఈ దేశాల్లో జనాభా పరివర్తన 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఐరోపాలోని అనేక దేశాల్లో సంతాన సాఫల్యతా రేటు భర్తీస్థాయి కంటే తక్కువగా ఉండటం వల్ల జనాభా పెరుగుదల రేటు స్వల్పంగా ఉంది. చారిత్రక కారణాల వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పరివర్తన నెమ్మదిగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో పారిశ్రామిక విప్లవం వల్ల అభివృద్ధిరేటు వేగవంతమై జనన, మరణాల రేట్లలో తగ్గుదల సంభవించింది. వలస ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధిరేటు తక్కువగా ఉన్నందువల్ల వాటికి అవకాశాలు దూరమయ్యాయి. పేదరిక తీవ్రత, విద్యాస్థాయి తక్కువగా ఉండటంతో పాటు కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు కానందున అనేక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో సగటున ప్రతి మహిళకు జన్మించే శిశువుల సంఖ్య ఆరు కంటే ఎక్కువగా ఉంది. దక్షిణాసియా దేశాల్లో అధిక కాలం పాటు సంతాన సాఫల్యతారేటు, మరణాల రేటు అధికంగా ఉంది.
  • పస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు జనాభా పరివర్తనకు సంబంధించి మూడో దశలో ఉన్నాయి. ఈ దశలో సంతాన సాఫల్యత, మరణాల రేటు తక్కువగా ఉంటుంది. అనేక దేశాల్లో జనాభా పరివర్తన డెమోగ్రాఫిక్ డివిడెండ్ ద్వారా ఆర్థికాభివృద్ధి ప్రక్రియపై ప్రభావం చూపింది. తూర్పు ఆసియా పులులుగా పిలిచే దేశాల్లో డెమోగ్రాఫిక్ డివిడెండ్.. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసింది. విద్యావంతులైన శ్రామికశక్తి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు అనుకూలంగా ఉండటం, నవకల్పనలతో కూడిన చలనాత్మక వ్యాపార రంగం, పారిశ్రామిక విధానాలు తదితర అంశాలు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు దోహదం చేశాయి.

డెమోగ్రాఫిక్ డివిడెండ్-ఆర్థికాభివృద్ధి :
భారత్‌లో పనిచేసే వయోవర్గ జనాభా (15-59 ఏళ్లు)లో యువ (15-34 ఏళ్లు) జనాభా అధికం. దీనివల్ల పొరుగుదేశాలతో పోల్చినపుడు భారత ఆర్థిక వ్యవస్థ.. అధిక వృద్ధి సాధనకు అవసరమైన సామర్థ్యం కలిగి ఉన్నట్లు చెప్పొచ్చు. ఆర్థికవేత్తల అభిప్రాయంలో వచ్చే దశాబ్దకాలంలో భారత్‌లో పనిచేసే జనాభాలో అధిక పెరుగుదల నమోదవుతుంది. సగటు భారతీయుని వయసు 2020 నాటికి 29 ఏళ్లుగా; చైనా, అమెరికా పౌరుల సగటు వయసు 37 ఏళ్లుగా; జపాన్ పౌరుల సగటు వయసు 48 ఏళ్లుగా ఉండగలదని అంచనా. 2030 నాటికి భారత్‌లో Youngest Median Age 31.2 ఏళ్లుగా, చైనాలో 42.5 సంవత్సరాలుగా ఉంటుందని అంచనా. అనేక ముఖ్య ఆర్థిక వ్యవస్థల్లో 20-64 ఏళ్ల వయోవర్గంలో తగ్గుదల ఉండగలదని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
  • డెమోగ్రాఫిక్ డివిడెండ్ వల్ల సామర్థిత శ్రామికశక్తిలో పెరుగుదల ఏర్పడి, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియాలో ఫెర్టిలిటీ, మరణాల రేటులో తగ్గుదల వల్ల జనాభా వయో నిర్మాణతలో మార్పులు చోటుచేసుకున్నాయి. 1960-90 మధ్యకాలంలో ఆరు ఆసియా దేశాల్లో జనాభా పెరుగుదల కంటే శ్రామిక శక్తి పెరుగుదల అధికం. ఆయా దేశాల్లో డెమోగ్రాఫిక్ బోనస్ కారణంగా తలసరి ఆదాయంలో సాంవత్సరిక వృద్ధి 0.8 శాతంగా నమోదైంది. అధిక శ్రామికశక్తి లభ్యత కారణంగా ఆయా దేశాల్లో ఉత్పాదక కార్యకలాపాలు పెరిగి, స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) వృద్ధి వేగవంతమైంది.
  • డెమోగ్రాఫిక్ డివిడెండ్ వల్ల ఆర్థిక వ్యవస్థలో పొదుపు, పెట్టుబడి రేటులో పెరుగుదల ఏర్పడుతుంది. భౌతిక, మానవ మూలధన కల్పనరేటు అధికంగా ఉండటం వల్ల తూర్పు ఆసియా దేశాలు ఆర్థిక ప్రగతి సాధించాయి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల మొత్తం వృద్ధిలో 15 శాతం వృద్ధి సాధన డెమోగ్రాఫిక్ డివిడెండ్ వల్ల సాధ్యమైంది.
  • మానవ వనరులపై అధిక పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల విద్య, ఆరోగ్య ప్రమాణాలు మెరుగవుతాయి. మానవాభివృద్ధి అధికంగా ఉన్న దేశాలు త్వరితగతిన ఆర్థికాభివృద్ధి సాధించినట్లు అనుభవ పూర్వక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

భారత్‌కున్న అవరోధాలు..
  • అధిక జనాభా, నిరుద్యోగిత పెరుగుదల, అసమానతలు, అక్షరాస్యత తక్కువగా ఉండటం, ఇతర సామాజిక-ఆర్థిక సమస్యలు డెమోగ్రాఫిక్ డివిడెండ్ వల్ల ప్రయోజనం పొందడంలో భారత్‌కు అవరోధంగా నిలిచాయి. మరోవైపు జననాల రేటు, మరణాల రేటు, డిపెండెన్సీ రేషియో తగ్గుదల తదితర అంశాలు భారత్‌కు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. అననుకూల ప్రభుత్వ విధానాల వల్ల డెమోగ్రాఫిక్ డివిడెండ్‌తో భారత్ ఆశించిన స్థాయిలో ప్రయోజనం పొందలేకపోతోంది.
  • భారత్‌లో ఇప్పటికే పనిచేసే వయోవర్గ జనాభా అధికంగా ఉంది. బాంబే స్టాక్ ఎక్ఛేంజ్ (బీఎస్‌ఈ), సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2017 చివరినాటికి భారత గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగితరేటు 4.59 శాతం కాగా.. పట్టణ ప్రాంతాల్లో 5.47 శాతంగా ఉంది. ఉపాధి కల్పన నెమ్మదించడం వల్ల భారతదేశ వృద్ధిని ఉపాధి రహిత వృద్ధిగా చెప్పొచ్చు. ఆసియా-పసిఫిక్ మానవాభివృద్ధి నివేదిక (2016) ప్రకారం వచ్చే 35 ఏళ్ల కాలంలో భారత్‌లో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల భారత్ డెమోగ్రాఫిక్ డివిడెండ్‌తో ప్రయోజనం పొందలేదు.
  • భారత్‌లో పనిచేసే శ్రామికశక్తిలో మహిళా భాగస్వామ్యం తక్కువ. జనాభా పరివర్తనకు సంబంధించి సంతాన సాఫల్యతారేటులో తగ్గుదల ఉన్నప్పుడు మహిళలు శ్రామికశక్తిలో భాగస్వామ్యం కావడానికి ప్రయత్నిస్తారు. ఉపాధికల్పన రేటు తక్కువగా ఉన్నప్పుడు ఆదాయస్థాయి క్షీణించి మానవాభివృద్ధి కుంటుపడుతుంది. సరైన నైపుణ్యత లేనందున మహిళా శ్రామికశక్తిలో నిరుద్యోగం పెరుగుతోంది.
  • ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) ప్రచురించే మానవాభివృద్ధి నివేదికల్లో భారత్ ఇప్పటికీ ‘మధ్యస్థాయి మానవాభివృద్ధి’ దేశంగానే మిగిలిపోయింది. విద్య, ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడనందువల్ల భారత శ్రామికశక్తిలో నైపుణ్యత లోపిస్తోంది.
  • పారిశ్రామికీకరణ వేగవంతమవడం, నాలుగో పారిశ్రామిక విప్లవం, సాంకేతిక ప్రగతి కారణంగా భారత్‌లో నమోదవుతున్న వృద్ధి ఉపాధి రహిత వృద్ధిగానే మిగిలిపోయింది. డిజిటల్ టెక్నాలజీ కారణంగా నూతన ఉత్పత్తుల సృష్టి, ఉత్పాదకతలతో కూడిన ఉపాధి లభ్యమవుతున్నప్పటికీ ప్రస్తుత ఉపాధికి డిజిటల్ టెక్నాలజీ ప్రత్యామ్నాయంగా నిలిచింది. అల్పమానవ మూలధన స్థాయి, నైపుణ్యం కొరత వల్ల కూడా భారత్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ వల్ల ప్రయోజనం పొందలేకపోతోంది.

వృద్ధికి ఓ ఇంజన్ :
భారత్ భవిష్యత్తు వృద్ధికి డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఓ ఇంజన్‌గా ఉపకరిస్తుంది. వచ్చే అయిదేళ్లలో మొత్తం 75 మిలియన్ల యువత శ్రమశక్తికి జతకాగలదని అంచనా. వీరిలో 75 శాతం మందికి వెంటనే ఉపాధి దొరక్కపోవచ్చు. నైపుణ్య లేమి కారణంగా 2022 నాటికి 100 మిలియన్ల మందికి ఉపాధి లభించకపోవచ్చు. ప్రపంచ జనాభాలో భారత్ వాటా దాదాపు 18 శాతం కాగా, లభ్యమయ్యే శ్రమశక్తి 520 మిలియన్లు. నైపుణ్యాభివృద్ధి; వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కారణంగా దేశంలో సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి. తయారీ, సేవారంగాల్లో పెట్టుబడులు పెరిగి నైపుణ్యత కలిగిన శ్రామికశక్తికి ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి. వాణిజ్య సరళీకరణలో భారత్ తన స్థితిని మెరుగుపరచుకున్నందున రాబోయే సంవత్సరాల్లో జీడీపీ, తలసరి ఆదాయాల్లో వృద్ధి అధికం కానుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంబంధించి పన్ను తిరిగి చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలి. దీనివల్ల వర్కింగ్ క్యాపిటల్ పెరిగి ఆర్థిక కార్యకలాపాలు విస్తృతమవుతాయి. భారత్‌లో పరపతి లభ్యత క్లిష్టమైన అంశంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జోక్యం అవసరం. అభివృద్ధి చెందిన దేశాల్లో పనిచేసే వయోవర్గ జనాభాలో తగ్గుదల కారణంగా పొరుగుసేవల నేపథ్యంతో డెమోగ్రాఫిక్ డివిడెండ్ వల్ల భారత్ ప్రయోజనం పొందగలదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అభిప్రాయంలో డెమోగ్రాఫిక్ డివిడెండ్‌తో భారత్ సాంవత్సరిక వృద్ధికి అదనంగా రెండు శాతం జతకాగలదు. నాణ్యత పెంపునకు కార్యాచరణ చట్రం రూపకల్పన; నాణ్యత హామీ విషయంలో పరిశ్రమ జోక్యం తదితరాల ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యత పెంపునకు చర్యలు అవసరం. సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలి. మానవాభివృద్ధి పెంపునకు విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ రంగ పెట్టుబడులను పెంచాల్సిన అవసరముంది.

సారాంశం :
ఆసియా, ఆసియా యేతర దేశాల్లో పనిచేసే వయోవర్గ జనాభా పెరుగుదల.. ఆయా దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిపై ధనాత్మక ప్రభావం చూపినట్లు అనేక అనుభవ పూర్వక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. జనాభా పరివర్తన కారణంగా వయోనిర్మాణతలో వచ్చిన మార్పు తూర్పు ఆసియా దేశాల్లో స్థూల ఆర్థిక ప్రగతికి దోహదం చేసింది. ఓ ఆర్థిక వ్యవస్థలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ వల్ల పొదుపు, పెట్టుబడి రేటులో పెరుగుదల ఏర్పడుతుంది. దీనివల్ల ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుంది. జనాభా పరివర్తనలో శ్రీలంక కంటే భారత్ వెనుకబడినప్పటికీ అధిక శ్రామికశక్తి లభ్యత కారణంగా భారత్ ముందంజలో ఉంటోంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో జనాభా వృద్ధి.. దీర్ఘకాల ఆర్థిక వృద్ధిపై ధనాత్మక ప్రభావం చూపుతుంది. అయితే డెమోగ్రాఫిక్ డివిడెండ్ వల్ల భారత్ ఏ మేరకు అధిక వృద్ధి సాధించగలదనే విషయం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. డెమోగ్రాఫిక్ డివిడెండ్‌తో ప్రయోజనం పొందే విషయంలో భారత్ వివిధ సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. పనిచేసే వయోవర్గ జనాభా భారతదేశంలోని పేదరాష్ట్రాల్లో కేంద్రీకృతం కావడం, శ్రామికశక్తికి నైపుణ్యత తక్కువగా ఉండటం, విద్యావిధానంలో లోపభూయిష్ట విధానాలు, మానవాభివృద్ధిపై ప్రభుత్వరంగ పెట్టుబడులు తక్కువగా ఉండటం తదితర అంశాలు భారత్ ముందున్న సవాళ్లని చెప్పొచ్చు. పాఠశాల స్థాయిలో జర్మనీ అమలుచేస్తున్న వృత్తివిద్య శిక్షణ కార్యక్రమాలు, రిపబ్లిక్ ఆఫ్ కొరియా.. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉదారంగా ఆర్థిక సహకారం చేయడం, స్వయం ఉపాధికి యువతకు మంగోలియా ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుండటం వంటి అంశాలను భారత్ పరిశీలించాలి. డెమోగ్రాఫిక్ డివిడెండ్ వల్ల ప్రయోజనం పొందే విషయంలో భారత్‌కు అనేక అవరోధాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడం ద్వారా భవిష్యత్తులో అధిక వృద్ధి సాధన దిశగా పయనించగలదు. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ విధానాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

వివిధ దేశాల్లో...
  • జర్మనీలో అమలవుతున్న వృత్తివిద్యా శిక్షణ కార్యక్రమాలు అంతర్జాతీయంగా గుర్తింపు సాధించాయి. ఉన్నతపాఠశాల విద్యార్థుల్లో మూడింట రెండొంతుల మంది 350 వృత్తులకు సంబంధించి వృత్తివిద్యా శిక్షణను ఎంపిక చేసుకుంటారు. వీరు కంపెనీల్లో అప్రెంటీస్‌షిప్‌ను కలిగి ఉండటంతో పాటు వారంలో ఒకట్రెండు రోజులు పాఠశాల తరగతులకు హాజరవుతారు. దీనివల్ల సైద్ధాంతిక శిక్షణతో పాటు పని అనుభవం పొందుతారు. ఈ విధానం వల్ల కంపెనీలకు కొత్త ఉద్యోగులకు శిక్షణ, ఖాళీల భర్తీ ప్రకటనల వ్యయం తగ్గుతుంది. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం నెలకు 680 యూరోల స్టైపెండ్ అందిస్తుంది.
  • జపాన్ పాఠశాలల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విద్య అమలవుతోంది. ‘డ్రీమ్‌గేట్ సర్వీస్’ కార్యక్రమం ద్వారా యువతకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై అవగాహన పెంపొందిస్తోంది. అసంఘటిత రంగంలో స్వయం ఉపాధి పొందుతున్నవారికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటుచేస్తోంది. తద్వారా వారు సంఘటిత రంగంలో ప్రవేశించేందుకు వీలవుతోంది.
  • యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రిపబ్లిక్ ఆఫ్ కొరియా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తోంది. పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), నవకల్పనలతో కూడిన వ్యాపార ఉత్పత్తులపై పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది.
Published date : 21 Jun 2019 11:59AM

Photo Stories