Skip to main content

బొగ్గు గనుల ప్రత్యేక కేటాయింపు బిల్లు

మన దేశంలో జాతీయ బొగ్గు నిల్వల (coal deposits)ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టిన తీరు దేశంలోనే అతి పెద్ద రాజకీయ కళంకం (political scandal) గా నిలిచింది.
ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) 2014 మార్చిలో విడుదల చేసిన డ్రాఫ్ట్ నివేదిక తేటతెల్లం చేసింది. 2004-09 మధ్య కాలంలో అప్పటి ఏలికలో ఉన్న ప్రభుత్వం బొగ్గు క్షేత్రాల కేటాయింపుల విషయంలో అనుసరించిన విధానాలు అసంబద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. దీంతో బొగ్గు క్షేత్రాల్లో అవినీతి మసి అంటిందనే విషయం బయట పడింది.

బొగ్గు క్షేత్రాల ధారాదత్తంలో చోటుచేసుకున్న రూ. వేలకోట్లలో ముడుపుల వ్యవహారం దేశమంతటా తీవ్రదుమారం రేపింది. వ్యవహారంపై ఇంటా బయటా జరిగిన చర్చల ఫలితంగా ఎట్టకేలకు కేంద్రంలో కదలిక వచ్చింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపు బిల్లు కార్యాచరణకు కంకణం కట్టుకుంది.

భారత ప్రభుత్వం జాతీయ బొగ్గు నిల్వల (coal deposites)ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలకు పంపిణీ చేసిన విధానం దేశంలోనే అతి పెద్ద రాజకీయ అవినీతి (political scandal)గా నిలిచింది. దీన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) 2014, మార్చిలో విడుదల చేసిన డ్రాఫ్ట్ నివేదిక వెల్లడించింది. 2004-09 మధ్య కాలానికి కేంద్రం చేసిన బొగ్గు క్షేత్రాలు కేటాయింపులు అసంబధ్ధంగాగా ఉన్నట్లు పేర్కొంది. అప్పటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బొగ్గు క్షేత్రాల పంపిణీ పోటీ బిడ్డింగ్ (competitve bidding) ద్వారా కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ విధంగా జరగలేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తక్కువ ధరకే బొగ్గు గనులను సొంతం చేసుకున్నాయని తద్వారా ఆ సంస్థలకు 170 బిలియన్ డాలర్ల లబ్ధి చేకూరిందని తన నివేదికలో స్పష్టం చేసింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన తుది నివేదికలో కాగ్ ఈ మొత్తాన్ని 29 బిలియన్ డాలర్లుగా పేర్కొంది.

కాగ్ తన మొదటి నివేదికలో ప్రభుత్వం కోల్ కేటాయింపులను సమర్థవంతంగా చేయాలని సూచించింది. 2012లో బొగ్గు క్షేత్రాల పంపిణీలో జరిగిన అవినీతి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీజేపీ ఫిర్యాదు ఫలితంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఈ పక్రియలో చోటు చేసుకున్న అవినీతిపై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని కోరింది. దర్యాప్తు చేసిన సీబీఐ తన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌లో 12 భారతీయ సంస్థలపై ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్)ను నమోదు చేసింది. సదరు సంస్థలు తమ నికర విలువలను అధికంగా చూపించటం, ఇంతకు ముందు జరిగిన కోల్ కేటాయింపులను వెల్లడించకపోవడాన్ని సీబీఐ తన నివేదికలో ప్రస్తావించింది. ఈ అంశాల ఆధారంగా బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో భారీగా ముడుపులు చేతులు మారినట్లు సీబీఐ అధికారులు అంచనాకొచ్చారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై ప్రజలు, మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ కేసు దర్యాప్తులో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై అప్పటి ప్రతిపక్షం బీజేపీ ప్రధాన మంత్రి రాజీనామాకి డిమాండ్ చేయటంతో పాటు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అందుకు నిరాకరించటంతో 20 రోజులు జరగాల్సిన సమావేశాలు ఏడు రోజులకే పరిమితమయ్యాయి.

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నివేదిక
1993 నుంచి 2008 మధ్య కాలంలో జరిగిన బొగ్గు క్షేత్రాల కేటాయింపు పూర్తి సవ్యంగా లేదంటూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (పీఎస్‌సీ) స్పష్టం చేసింది. ఈ పక్రియ ఏ మాత్రం పారదర్శకంగా జరగలేదని ఫలితంగా ప్రభుత్వం రూ.కోట్ల మేర నష్టపోయిందని తేల్చింది. కేటాయింపులపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కమిటీ అభిప్రాయపడింది. దాంతో పాటు ఉత్పత్తి ప్రారంభించని గనుల కేటాయింపును వెంటనే రద్దు చేయాల్సిందిగా నివేదికలో సూచించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా గనుల కేటాయింపు ప్రక్రియతో సంబంధమున్న అందరిపైనా, కేటాయింపుల్లో వారి పాత్రపైనా దర్యాప్తు జరపాలని చెప్పింది. 1993-2004 మధ్య జరిగిన కేటాయింపులు, ఎలాంటి ప్రభుత్వ సమాచారం లేకుండా జరిగాయని కమిటీ నివేదికలో తప్పుబట్టింది.

సుప్రీం కోర్టు జోక్యం:
బొగ్గు క్షేత్రాల అవినీతి తీరుతెన్నులు (కోల్ స్కాం స్టేటస్) నివేదికలోని అంశాలను న్యాయ శాఖ మంత్రి అశ్వినీ కుమార్‌తో పంచుకున్నట్లు అప్పటి సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా 2013, ఏప్రిల్ 26న సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తమ నివేదికలోని 20 అంశాలను ప్రభుత్వం మార్చినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకి 2013, ఏప్రిల్ 29న తెలిపింది. దీంతో సుప్రీం ఈ విషయంపై తీవ్ర స్థాయిలో స్పందించింది. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు అడిషినల్ సొలిసిటర్ జనరల్ హరిన్ రావల్ రాజీనామా చేశారు. ఈ సందర్బంగా సీబీఐ ప్రభుత్వంలోని విభాగమని, స్వయం ప్రతిపత్తిలేని సంస్థని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా సుప్రీంకోర్టుకి తెలిపారు. స్పందించిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం నివేదికలోని అంశాలను పంచుకోవటం వల్ల ఏమేరకు దర్యాప్తుపై ప్రభావం పడిందనే అంశాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ క్రమంలో అప్పటి న్యాయ శాఖ మంత్రి అశ్వినీకుమార్ రాజీనామా చేశారు. తదనంతరం విచారణలో భాగంగా 2013, జూన్11న, నవీన్ జిందాల్, దాసరి నారాయణరావులపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2013, అక్టోబర్ 16న ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, మాజీ కోల్ సెక్రటరీ పి.సి ఫరేఖ్‌లపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. బొగ్గు కుంభకోణం కేసు విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు 2014 జులైలో ప్రత్యేక సీబీఐ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పంజాబ్ మాజీ అడ్వకేట్ జనరల్ రాజిందర్ సింగ్ ఛీమాను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, రోజూవారీ కేసు విచారణ జడ్జిగా జస్టిస్ భరత్ పరాషర్‌ని ప్రత్యేక కోర్టులో సుప్రీం నియమించింది. వివిధ కోర్టుల్లో కుంభకోణంపై పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను ప్రత్యేక సీబీఐ కోర్టుకు బదలాయించాలని నిర్ణయించింది.

214 క్షేత్రాల రద్దు - సుప్రీం తీర్పు
బొగ్గు క్షేత్రాల తీరుపై కొనసాగిన వాదోపవాదాల పరంపరను క్షుణ్నంగా పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. 2014, సెప్టెంబర్ 24న చారిత్రక తీర్పు వెలువరించింది. 1993 తర్వాత కేటాయించిన 218 బొగ్గు క్షేత్రాల్లో 214 క్షేత్రాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ బొగ్గు క్షేత్రాల్లో రూ.రెండు లక్షల కోట్ల పెట్బుడులు ఉన్నట్లు అంచనా. దీంతో పాటు బొగ్గు వెలికితీత ప్రారంభించి, కార్యకలాపాలను కొనసాగిస్తున్న గనుల్లో ప్రతి టన్నుకు రూ.295 జరిమానా చెల్లించాలని సుప్రీం ఆదేశించింది.

బొగ్గు గనుల బిల్లు 2015
బొగ్గు గనుల (social provisions) రెండో ఆర్డినెన్స్ స్థానంలో పార్లమెంటు బొగ్గు గనుల బిల్లు-2015ను ఆమోదించింది. ఈ బిల్లును 2015, మార్చి 4న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి.

బిల్లులోని ముఖ్యాంశాలు
  1. గనుల కేటాయింపు పారదర్శకంగా నిర్వహించేందుకు గనుల కేటాయింపుల్లో వేలం పక్రియను ప్రవేశపెట్టడం.
  2. ఈ-వేలం రూపంలో బొగ్గు గనుల తవ్వకాల కార్యకలాపాలను కొనసాగించాలి. ఇలా చేయడం వల్ల బొగ్గు వనరుల వినియోగం అభిలషణీయంగా ఉంటుంది.
  3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రత్యక్షంగా గనుల కేటాయింపు.
  4. ఈ- వేలం ద్వారా ప్రైవేటు కంపెనీలకు బొగ్గు క్షేత్రాల కేటాయింపు.
  5. బొగ్గు గనుల వేలానికి చట్టబద్దత.
  6. గనుల నుంచి లభించే ఆదాయంలో నిర్దిష్ట శాతాన్ని స్థానిక ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయాలి.
  7. 50 సంవత్సరాల వరకు లెసైన్స్ కాలపరిమితి.
  8. ఆయా ప్రాంతాల నుంచి తరలించే ప్రజలకు పటిష్టమైన పునరావాసం, నష్టపరిహార చర్యలు.

బొగ్గు గనుల ప్రత్యేక కేటాయింపు
బిల్లు-2015 లక్షణాలు
  1. రద్దైన 204 బ్లాకులను ‘షెడ్యూల్ -1 బొగ్గు గనులు’గా నిర్వచించారు.
  2. బొగ్గు గనుల (కోల్ మైన్) ఉత్పత్తికి సిద్ధంగానూ, ప్రస్తుతం ఉత్పత్తి ప్రక్రియలో ఉన్న 42 క్షేత్రాలను ‘షెడ్యూల్ - 2 బొగ్గు గనులు’గా పేర్కొన్నారు.
  3. 32 అభివృద్ధిలో ఉన్న (Sub stantially developed) క్షేత్రాలను ‘షెడ్యూల్-3’లో చేర్చారు.
  4. నష్టపరిహారాన్ని చెల్లించడానికి ‘కమిషనర్ ఆఫ్ పేమెంట్స్’ను నియమించారు.
  5. వేలం ద్వారా గనుల కేటాయింపు జరిగే వరకు వాటి నిర్వహణ, యాజమాన్యం కోసం కేంద్ర ప్రభుత్వం కస్టోడియన్‌ను నియమించవచ్చు.
  6. వేలం ద్వారా లభించిన మొత్తాన్ని నామినేటెడ్ అథారిటీ వసూలు చేసి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తుంది.

నూతన గనుల యుగం (New mining era)
ఏప్రిల్ 1, 2014 నాటికి దేశంలో 301.56 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. 2013-14లో కోల్ ఇండియా ఉత్పత్తి 462.53 మిలియన్ టన్నులు. 2013-14లో స్వాధీనత బ్లాకుల్లో ఉత్పత్తి లక్ష్యం 50 మిలియన్ టన్నులు కాగా 2014 ఫిబ్రవరి నాటికి 38.88 మిలియన్ టన్నులకు చేరింది. 1993 నుంచి 2011 మధ్య కాలంలో 50 బిలియన్ టన్నుల రిజర్వ్‌తో కూడిన 218 బొగ్గు గనుల క్షేత్రాల కేటాయింపు జరిగింది. ప్రత్యేక కేటాయింపు బిల్లు 2015 వల్ల స్వదేశీ, విదేశీ కంపెనీలు బొగ్గును వెలికితీయడంతోపాటు బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకొనే అవకాశం ఏర్పడింది. దీనిద్వారా బొగ్గు తవ్వకాల్లో ప్రభుత్వ ఏకస్వామ్య ధోరణికి కాలం చెల్లింది. కోల్ ఇండియా శ్రామికుల ప్రయోజనాలను పరిరక్షించ గలమని ప్రభుత్వం ప్రకటించింది. కోల్ ఇండియా కార్యకలాపాలపై ఈ బిల్లు ప్రభావం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. బొగ్గు గనుల ప్రత్యేక కేటాయింపు బిల్లు 2015 ప్రకారం ముందుకాలంలో ప్రైవేటు కంపెనీలు తమ సొంత ఫ్యాక్టరీలకు ఇంధనంగా వినియోగించుకోవడానికి మాత్రమే బొగ్గు తవ్వకాల్లో అనుమతి ఉంటుంది. ఈ బిల్లు ప్రకారం బహిరంగ మార్కెట్‌లోనూ విక్రయించే అవకాశం కల్పించినందువల్ల అధిక విదేశీ పెట్టుబడులను ఆశించవచ్చు. భారతీయ అనుబంధ కంపెనీల సహకారంతో విదేశీ కంపెనీలు కమర్షియల్ కోల్‌మైనింగ్‌లోనూ పాల్గొనవచ్చు.

కమర్షియల్ మైనింగ్ ఆఫ్ కోల్
బొగ్గు గనుల ప్రత్యేక కేటాయింపు బిల్లు-2015 ద్వారా ప్రభుత్వం వాణిజ్యపరమైన తవ్వకాల్లో అనుమతించ డానికి అన్ని చర్యలు చేపట్టింది. ఈ విషయంలో మొదటగా ప్రభుత్వ రంగ సంస్థలకు గనుల కేటాయింపు జరిపినట్లు బొగ్గు శాఖ కార్యదర్శి (కోల్ సెక్రటరీ) అనిల్ స్వరూప్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 204 బొగ్గు క్షేత్రాలను పారదర్శకతతో కూడిన ప్రక్రియ ద్వారా కేటాయిస్తుందని, వీటిలో 67 క్షేత్రాలను వేలం లేదా నామినేషన్ పద్ధతిలో ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించగలమని ఆయన ప్రకటించారు. గనుల్లో వాణిజ్యపరమైన తవ్వకాలు చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉందని, దీన్ని అదే విధంగా కొనసాగించాలని భావిస్తున్నట్లు అనిల్ స్వరూప్ తెలిపారు. ఏప్రిల్ చివర్లో త రువాత దశలో నిర్వహించే వేలం ద్వారా 15 నుంచి 20 బొగ్గు క్షేత్రాలు విక్రయించడానికి నిర్ణయించినట్లు బొగ్గు, పునరుత్పాదక శక్తి వనరుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రక టించారు.

బిల్లు - ప్రముఖుల అభిప్రాయాలు
  • ఆర్థిక వ్యవస్థపై ఈ బిల్లు ప్రభావం ధనాత్మకంగా ఉంటుంది. బొగ్గు రంగం పనితీరు సక్రమంగా ఉన్నట్లయితే అవస్థాపనా సౌకర్యాలు మెరుగుపడి ఆర్థిక వృద్ధి రేటు వేగవంతమవుతుంది.
    - సౌమ్యకాంతి ఘోష్, ముఖ్య ఆర్థిక కార్యదర్శి,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

  • బొగ్గు గనుల కేటాయింపుతో పారదర్శకత ఏర్పడుతుంది. గనుల తవ్వకం రంగంలో ప్రగతి ఏర్పడగలదు.
    - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్.

  • బొగ్గు క్షేత్రాల బిల్లు ద్వారా టాటాస్టీల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) అధిక ప్రయోజనాలను పొందగలవని ఆయా సంస్థల ఆధీనంలోని గనులు మార్చి 2030 వరకు వాటి పరిధిలోనే కొనసాగగలవు.
    - కమలేశ్ బగ్మర్, సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్.

  • బొగ్గు గనుల్లో పని షరతులను మెరుగుపరిచే ఎలాంటి చర్యలను బిల్లులో పొందపరచలేదు.
    - జ్యోతిరాదిత్య సింథియా, మాజీ కేంద్రమంత్రి.
Published date : 01 May 2015 12:09PM

Photo Stories